సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలిరామగుండంలో ఐక్య వేదిక కార్యాచరణ సమావేశం
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
రామగుండంలో ఐక్య వేదిక కార్యాచరణ సమావేశం
సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రామగుండం ఏరియాలో కార్యాచరణ సమావేశం నిర్వహించారు. సింగరేణి కార్మికుల డిపెండెంట్ల హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఐక్య వేదిక అధ్యక్షుడు లక్క శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు తెలంగాణ అభివృద్ధికి వెన్నెముకలా నిలిచినా, వారి వారసులకు న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు.
ఇప్పటివరకు పాదయాత్రలు, సింగరేణి భవన్ ముట్టడి, ముఖ్యమంత్రి సభల అడ్డుకోవడం, అరెస్టులు వంటి పోరాటాలు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగం రాక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పొన్నం వెంకటేశ్ కుటుంబంలో ఎనిమిది నెలల పసిపాప మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో నాలుగు ముఖ్య కార్యాచరణ అంశాలను నిర్ణయించారు. మొదటగా 11 కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు మారుపేర్ల సమస్య పరిష్కారంపై వినతిపత్రాలు అందజేయాలని తీర్మానించారు. మిగతా కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
సింగరేణిలోని ఐదు జాతీయ కార్మిక సంఘాలు బాధితుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమిష్టిగా పోరాడాలని కోరారు. కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కమిటీ ఏర్పాటు చేసి సింగరేణి అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన జీఓ విడుదల చేసి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఎస్యూఎస్, ఏఐఎఫ్టీయూ, టిబీజీకేఎస్ నాయకులతో పాటు 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంతాలకు చెందిన మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్, మెడికల్ బోర్డు బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారం వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కామెంట్లు