సూపర్ ఎల్నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశం
కమాన్పూర్, జూలై 27 (ఇది మన హక్కు):
సూపర్ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఖరీఫ్ సాగు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, ఫార్మ్ పాండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో నీటి లభ్యత దృష్ట్యా కందులు, పెసలు, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆయిల్పామ్ వంటి పంటలను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు.
రాబోయే పది రోజులను ప్రత్యేక కార్యాచరణగా తీసుకుని గ్రామాల వారీగా రైతులను పంట మార్పిడికి ప్రోత్సహించాలని, ప్రతిరోజూ పురోగతి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్లో లక్ష్యంగా నిర్దేశించిన 2.91 లక్షల ఎకరాల సాగును తప్పనిసరిగా సాధించాలని, భూములు బీడుగా ఉంచకుండా సాగులోకి తీసుకురావాలని సూచించారు. ఒంటరి మహిళా రైతులు, చిన్న, సన్నకారు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహం అందించడంతో పాటు భూగర్భ జలాల పెంపు కోసం ఫార్మ్ పాండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి చెల్లింపులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి