భారీ వర్షాల బాధితులకు తక్షణ సాయం అందించాలి – ఏఐటీయూసీ డిమాండ్
ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్
గోదావరిఖని, జూలై 30 (ఇది మన హక్కు):
భారీ వర్షాల కారణంగా ఇళ్లు, గోడలు కూలిపోయి నిరాశ్రయులైన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు తక్షణ సాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) రామగుండం నగర సమితి అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నిరాశ్రయులైన వారికి నిత్యావసర వస్తువులు, ఆహారం అందించి, తక్షణ పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి బాధితుల అవసరాలను వెంటనే తీర్చాలని, లేకపోతే బాధితుల పక్షాన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి